Monday, 3 October 2011

కనకదుర్గను దర్శించుకున్న అల్లు అర్జున్

విజయవాడ: ఇంద్ర కీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని సినీ హీరో అల్లు అర్జున్ దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అల్లు అర్జున్ దంపతులకు ఆలయ ఈవో అమ్మవారి దర్శనాన్ని చేయించారు. ఈ సందర్భంగా పండితులతో అమ్మవారి శేష వస్త్రం కప్పి, ప్రసాదాలను అందచేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.

కిరణ్ సర్కార్ శాడిస్టులా.. : కేకే

న్యూఢిల్లీ: సర్కార్ శాడిస్టులా ప్రవర్తిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత కే. కేశవరావు నిప్పులు చెరిగారు. గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసింది. తెలంగాణ కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని కేకే అన్నారు.

పండుగకు వేయి బస్సులు నడపండి:సీఎం

హైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు కనీసం వేయి బస్సులను నడపాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు చేశారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమావేశం జరిగింది. విద్యుత్‌కోతను పండుగ సందర్భంగా లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను కోరారు. వ్యవసాయరంగానికి ఎటువంటి అంతరాయం కలుగకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. ఇప్పటికే 500 బస్సులను సిద్ధం చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా స్తంభించిందని పక్క రాష్ట్రాలనుంచి విద్యుత్ కొనుగోలు చేసి, కొరత లేకుండా చూస్తామని ట్రాన్స్‌కో ఎండీ తెలిపారు.

రేపటి నుంచి హైవే దిగ్భంధం: జగదీశ్వర్‌రెడ్డి

కోదాడ: నల్గొండ జిల్లాలోని హైవేలను దిగ్భంగం చేస్తామని టీఆర్‌ఎస్ నేత జగదీశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు హైవేలను దిగ్భంధం చేస్తామన్నారు. హైవేతోపాటు చిన్న, చిన్న రహదారులను కూడా మూసివేస్తామని ఆయన మీడియాతో అన్నారు

ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటి

న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌తో కేసీఆర్, తెలంగాణ జేఏసీ నాయకుల సమావేశం ముగిసింది. తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ప్రధాని జేఏసీ నేతలు కోరినట్టు తెలిసింది. ఈ మేరకు నాలుగు డిమాండ్‌లతో కూడిన లేఖను జేఏసీ నేతలు ప్రధానికి సమర్పించారు. ప్రధానితో సమావేశం సుమారు 40 నిమిషాలపాటు సాగింది.

కాలపరిమితితో కూడిన కార్యచరణ: జానా

హైదరాబాద్: తాము ఏ త్యాగం చేసినా పార్టీ ప్రతిష్టను పెంచేలా చర్యలు తీసుకుంటామని జానారెడ్డి స్పష్టం చేశారు. దేశరాజధానిలో ప్రధాని, పలువురు నేతలతో సమావేశమైన తర్వాత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత మంత్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాలపరిమితితో కూడిన కార్యాచరణను అధిష్టానం ప్రకటించాలని జానారెడ్డి డిమాండ్‌చేశారు. తాము ఏ జేఏసీతో కలువమని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ వెంటనే వచ్చేలా అందర్ని కలుపుకుపోతామన్నారు. అధిష్టానాన్ని ధిక్కరించబోమని ఆయన అన్నారు.